మీరాబాయి చాను ఇక అడిషనల్ ఎస్పీ... మణిపూర్ ప్రభుత్వం నిర్ణయం

  • టోక్యో ఒలింపిక్స్ లో చానుకు రజతం
  • చానుపై ప్రశంసల జడివాన
  • ఇప్పటికే రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ సీఎం
  • ఢిల్లీలో చానుకు ఘనస్వాగతం
టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు విశిష్ట గౌరవం దక్కనుంది. ఆమెను అడిషనల్ ఎస్పీగా నియమించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం బీరేన్ సింగ్ మాట్లాడుతూ, చానుకు రూ.1 కోటి నజరానా అందించాలని ఇంతకుముందే ప్రకటించామని, తాజాగా ఆమెను ఏఎస్సీగానూ నియమిస్తున్నామని వెల్లడించారు. అటు, ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మణిపూర్ కు చెందిన జూడో క్రీడాకారిణి లిక్మబమ్ సుశీలా దేవికి పోలీసు కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా పదోన్నతి కల్పిస్తున్నామని, రూ.25 లక్షల నజరానా కూడా అందిస్తున్నామని సీఎం తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్ రెండో రోజున నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో చాను 49 కిలోల విభాగంలో రెండోస్థానంలో నిలిచి రజతం సాధించింది. దాంతో దేశవ్యాప్తంగా చాను పేరు మార్మోగుతోంది. కాగా, టోక్యోలో తన ఈవెంట్ పూర్తి కావడంతో చాను స్వదేశానికి తిరిగొచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. క్రీడాభిమానులు "భారత్ మాతా కీ జై" నినాదాలతో ఎయిర్ పోర్టు పరిసరాలను హోరెత్తించారు.

Mirabai Chanu
ASP
Manipur
Biren Singh
Tokyo Olympics

More Telugu News